Sunday, September 9, 2018

పద్య సాహిత్యంలో గణపతి స్తుతులు - ఆంధ్రభూమి (దినపత్రిక) వ్యాసం

ప్రణవ స్వరూపుడు - ప్రమద గణాధిపతి - పార్వతీ పరమేశ్వరుల ప్రియ పుత్రుడు - సకల జగతికి ప్రేమపాత్రుడైన విఘ్న నాయకుడు వేదాల్లో - ఉపనిషత్తుల్లో.. అష్టాదశ పురాణాల్లో కీర్తింపబడినాడు. అలాగే తెలుగు సాహితీ నందనవనంలో, ప్రబంధాలలో - శతక సాహిత్యంలో భాగవత భారత రామాయణాలలో తొలి వేలుపుగా ప్రస్తుతింపబడినవాడు. భావ భాషాత్మకమైన శబ్ద వాచ్యుడై పద్య రచనలలో ప్రాచీనులచే గాక - ఆధునిక కవులచే నుతింపబడి వారి కవిత్వానికి విఘ్నాలు - ఎలాంటి ఆటంకాలు కలుగకుండా సాహిత్యంలో పద్యాలలో స్తుతింపబడి, నిండి నిబిడీకృతమైనాడు గజముఖుడై పద్య సుమాలచే ఆరాధింపబడినాడు.
గాయత్రీ మంత్రంలో - అంతర్భాగమైన ఒక పద్యం ఇలా ఉంది.
ఉ.తొండము నేక దంతమును - తోరపు బొజ్జయు, వామ హస్తమున్
మెండుగ - మ్రోయు గజ్జెలును - మెల్లని చూపుల - మందహాసమున్
కొండొక గుజ్జు రూపమున - కోరిన విద్యలకెల్ల నొజ్జయై
యుండెడి ‘పార్వతీ తనయ’ ఓయి ‘గణాధిప’ నీకు మ్రొక్కెదన్
అని వర్ణించాడో కవి.
భాగవత పురాణంలో - సహజ కవి బమ్మెర పోతనామాత్యుని అద్భుత వర్ణన గావించిన అంత్యప్రాసతో గూడిన ఒక పద్యం
ఉ.ఆదరమొప్ప మ్రొక్కిడుదు - నద్రిసుతా హృదయానురాగ సం
పాదికి - దోష బేధికి - ప్రసన్న వినోదికి - విఘ్నవల్లికా
చ్ఛేదికి - మంజువాదికి - నశేష జగజ్జన - నందవేదికిన్
మోదక ఖాదికిన్ - సమద మూషకసాదికి - సుప్రసాదికిన్

నన్నెచోడుని గ్రంథం కుమార సంభవంలో గణపతి ప్రార్థన

చం.తనునసితాంబు దంబుసిత - దంతయుగంబచిరాంశులాత్మ గ
ర్జన - మురుగర్జనంబుగ - రసద్రుచి - శక్రశరాసనంబునై
చన - మదవారివృష్టి - హితసస్యసమృద్ధిగ - నభ్రవేళ నా
జన ‘గణనాథు’ గొల్తు - ననిశంబు - నభీష్ఠ ఫలప్రదాతకున్
అంటూ మనోజ్ఞంగా వర్ణించాడు మహాకవి.

అభీష్ట సిద్ధి కొరకు అనంతామాత్య కవి తన ప్రబంధం భోజరాజీయంలోని వర్ణన ఇలా సాగింది.
ఉ.విఘ్నము లెల్ల బాపి - పృథివిన్ - భవనీరధి పేరి మిగుల్చి, సం
దఘ్నము చేసి నిల్తు - రుచిరస్థితి నెవ్వని భృత్యులట్టి- దుః
ఖఘు్నడు - షణ్ముఖ ప్రథమ గర్భుడు - భద్రగజాస్యుడైన - యా
విఘ్నవిభుండు - మత్ కృతికి - వేడుకతోడ - సహాయుడయ్యెడున్
ఉ.అంకము చేరి - శైలతనయాస్తన - దుగ్ధములానువేళ బా
ల్యాంక విచేష్ఠ తొండమున - నవ్వలిచన్ గబళింపబోయి యా
వంక కుచంబు గానక హివల్లభుహారము గాంచి వే మృణా
ళాంకుర శంకనంటిడు - గజాస్యుని గొల్తు - నభీష్ట సిద్ధికిన్
అని నుతించారు ఆ హేరంబునీ, గణపతినీ.
జక్కన కవి తన విక్రమార్క చరితంలోని గణనాయకుని వర్ణన.
చం.కనకనగంబు బొమ్మరముగా - భుజగేంద్రుడు జాలెగా నమ
ర్చిన గిరిపుత్రికాంచి - యివి రెండును - దేవధనంబులన్న -న
జ్జనని హితోపదేశమున సన్మతివాని బునః ప్రతిష్ఠ చే
సిన గణనాయకుండు కృపసేయుత సిద్ధన మంత్రి కోరికల్
అని నుతించాడు. వేడినాడు.
అలాగే శ్రీనాథ కవి ప్రణీతమైన హరవిలాస కావ్యంలోని వర్ణన ఒక సీస పద్యం
సీ.కలిత శుండాదండ గండూషితోన్ముక్త
సప్తసాగర మహాజల ధరములు
వప్రక్రియా కేళి వశ విశీర్ణ సువర్ణ
మేదినీధర రత్న మేఖలములు
పక్వజంబూఫల ప్రకట సంభావనా
చుంబిత భూభృత్ కదంబకములు
వికట కండూలగండక దేహమండలీ
ఘట్టిత బ్రహ్మాండ కర్పరములు
తే.గీ.శాంభవీ శంభులోచనోత్సవ కరములు
వాసవాద్య మృతాశన వందితములు
‘విఘ్నరాజ’ మదోల్లాస విభ్రమములు
మించి విఘ్నోపశాంతి - గావించుగాత
అని రచించారు.
మనోజ్ఞ కవి రామరాజ భూషణుడు తన కావ్యం వసుచరిత్రలో గజముఖుని ప్రస్తుతించిన తీరు ప్రశంసనీయము.
శా.దంతాఘట్టిత రాజతాచల - చలద్గౌరీ స్వయంగ్రాహమున్
కంతుద్వేషికి గూర్చి - శైలజకు - దద్గంగాఝ రాచాంతి న
త్యంతామోదము మున్నుగానిడి - కుమారాగ్రేసరుండై పితృ
స్వాంతం బుల్వెలయింపంజాలు నిభ రాడ్వక్త్రుం బ్రశంసించెదన్
ప్రాచీన నవీన కవులేగాక నేటి మేటి కవిపుంగవులెందరో గణపతిని స్తోత్రం చేసిన తీరు అద్భుతం. అమోఘం. మచ్చుకు కొన్ని. ఆధునిక కవి కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్ర్తీ గారు వినాయకుని స్తుతించమని విద్యార్థులను మేల్కొలిపిన తీరు ఇలా ఉంది సీస పద్యంలో.
సీ.ఎలుక గుఱ్ఱము మీద - నీరేడు భువనాల
పరువెత్తి వచ్చిన పందెకాడు,
ముల్లోకముల నేలు ముక్కంటి యింటిలో
పెత్తనమ్మొనరించు పెద్ద కొడుకు
నల్లమామాయంచు నారాయణుని పరి
యాచకాలాడు మేనల్లు కుర్ర
వడకు గుబ్బలి రాచవారి బిడ్డ - భవాని
నూరేండ్లు నోచిన - నోముపంట
తే.అమరులందగ్రతాంబూలమందు మేటి
ఆరుమోముల జగజెట్టి అన్నగారు
విఘ్నదేవుడు వాహ్యాళి వెడలి వచ్చె
ఆంధ్ర విద్యార్థి లెమ్ము - జోహారులిడగ 

- అని వర్ణించారు అభినవ పోతన బిరుదాంకితులు కరుణశ్రీ. వీరే మరొక పద్యంలో గణపతిని బోళా గణపతిగా వినాయకుని ఆహార నైవేద్యాదుల సరళిని తెల్పినారు. గుంజిళ్లు తనకు ఎంతో ఇష్టమని గణపతి పొంగిపోయే రీతి అద్భుతం.

సీ.లడ్డూ జిలేబీ హల్వాలె యక్కరలేదు
బియ్యపుండ్రాళ్లకే చెయ్యి చాచు
వలిపంపు పట్టు దువ్వలువలే పనిలేదు
పసుపు గోచీకె సంబ్రాలు పడును
ముడుపుమూటల పెట్టుబడి పట్టుదల లేదు
పొట్టి గుంజిళ్లకే పొంగిపోవు
కల్కితురారుూలకై తగాదా లేదు
గరిక పూజకె తలకాయనొగ్గు

గీ.పంచకల్యాణికై - యల్కపాన్పు లేదు
ఎలుకతత్తడికే బుజాలెగురవైచు
పంచభక్ష్యాలకై మొండిపట్టులేదు
పచ్చి వడపప్పె తిను - వట్టి పిచ్చి తండ్రి’ 

అని జాలిగా వర్ణించారు.
గణపతికి భోగభాగ్యాలక్కరలేదనీ తెలిపారు. ఈ విధంగా భారతీయ ఆంధ్ర సాహితీ సీమలో పద్య రచనలో విఘ్న నాయకుడైన విఘ్నాధిపతిని సకల జగతీ ఆరాధించి అర్చించి తరించాలనీ మనసారా ఆకాంక్ష.
ఓం శ్రీ గణాధిపతయే నమః
-పి.వి.సీతారామమూర్తి 9490386015

ఆంధ్రభూమి పత్రిక లో ఈనాడు వచ్చిన వ్యాసం యధాతథంగా 

లింకు 

http://www.andhrabhoomi.net/weekly_special/aadivaram/content/190273

పై వ్యాసానికి మఱొక కొనసాగింపు పద్యము.

పెద్దనగారి "స్వారోచిషమనుసంభవము"లోనిది. 

అంకముజేరి శైలతనయాస్తన దుగ్ధములానువేళ బా:
ల్యాంకవిచేష్ట తొండమున అవ్వలిచన్‌ కబళింపబోయి ఆ:
వంక కుచంబు గాన కహివల్లభహారము గాంచి వే మృణా:
ళాంకురశంక నంటెడు గజాస్యుని కొల్తు నభీష్టసిద్ధికిన్‌:

Monday, September 3, 2018

వేంకటనాయకుడు - స్తుతి

క. అలమేలు మంగ మాంబను
చెలిఁగాఁగైకొనియు నెలమి శ్రీతిర్మలపై
నెలవై భక్తులఁ బ్రోఁచెడి
యిలువేల్పుం గొలుతు వేంకటేశ్వరదేవున్

(స్తుత్యంజలి - సిరియాళ చరిత్రము - సాలగ్రామ చింతామణి కవి)

శివుని స్తుతి

ఉ. దేవ! మహానుభావ! భవ
                                  దీయచరిత్రము లద్భుతంబులై
పావన మౌచు యీ భువన
                                  వంద్యము లై చెలువారుచుండునో
దేవర! మీకృపారసము
                                  దీనులపై నిక్ జూపవేమి మా
భావములందు నెంచి బహు
                                  భంగుల్ బ్రస్తుతిజేతు మీశ్వరా!!



మ. హర! గంగాధర! ఫాలనేత్ర! రివు సం
                                 హారా! దయాంభోనిధీ!
వరగౌరీ కుచకుంకుమాగరుల స
                                 త్పాటీబాహ్వంతరా!
కరముల్ మోడ్చి నమస్కరించిని యో
                                కైవల్య సంధాయకా!
చరణంబుల్ శరణంటి నందు మిక నీ
                                శా! బ్రోవు సర్వేశ్వరా!



మ. నిరతంబున్ నిను గొల్పి భక్తవరులున్
                                                నిత్యంబు నీ సన్నిధిన్
పరమామోదముతోడ నుందు రని చె
                                                 ప్ప న్వింటి ముమ్మాటికిన్
మొర నాలించియు నాశ లన్నియును ని
                                                 ర్మూలంబుగా జేయు మీ
చరణంబుల్ శరణంటి నందు మిక నీ
                                                 శా! బ్రోవు వీరేశ్వరా!



మ. స్థిరమౌ నీ దగు నామమంత్రమును మా
                                          చిత్తంబులన్ నమ్మి తో
పరమేశా! గిరిజాధవా! మురహరా!
                                          ఫాలక్షా! యం చాత్మలో
పరితాపంబును జెందు భక్తతతి కా
                                          పాడంగ విచ్చేసితౌ
చరణంబుల్ శరణంటి నందు మిక నీ
                                          శా! బ్రోవు భీమేశ్వరా!



సీ. మహనీయ! నీ దగు మహిమల దెలియంగ
                                           నల మౌనివరులకు నలవి యగునె
యీశ్వర! నీరూప మేవేళలందైన
                                           వేదాంతదృష్టుల వెలయుచుండు
యిందుశేఖరు డెందమందు ధ్యానించంగ
                                           యీషణత్రిత్రయం బదెల్ల బాయు
భవ! నీ శిరమ్మునం బరగు యా సురనది
                                           రంగత్తరంగముల్ పొంగుచుండు.



గీ. భువనవందిత జగదంబ యెవని పత్ని
వాసుకియు తక్షకుండును వరసుకుండ
లమ్ములై యుండు యెవని కర్ణమ్ములందు
ఆమహేశుడ వీవు గావే మహాత్మ!



గీ. రాజసంబున సృజియించు ప్రభు వెవండొ
సాత్వికంబున బోషించు స్వామి యెవడొ
తామసంబున హరియించు దైవ మెవడొ
అట్టి దేవాదిదేవుడ వయ్య నీవు!


సీ. శ్రీపార్వతీనాథ! శ్రితజనమందార!
                                                      దీనశరణ్య! యో దేవ దేవ!
పన్నగభూషణ! సన్నుతామరవంద్య!
                                                      దీనశరణ్య! యో దేవ దేవ!
శ్రీసదాశంభో! సు వాసుకి భూషణ!
                                                      మునివంద్య! నీకు నమోస్తు దేవ!
పరమేశ్వరా! భక్తవరకల్పకద్రుమా!
                                                      అరమరగాదు మా శరణు దేవ!


గీ. సర్వలోకాధినాథ! యో శరణు దేవ!
సకలభూతేశ! శంకర! శరణు దేవ!
సకలమౌనీశ! విశ్వేశ! శరణుదేవ!
దీనులను మమ్ము బ్రోవు మో దేవ దేవ!


గీ. అనుపమానుండు నజరుండు నద్వితీయు
డాదిదేవు డనంతుండు నవ్యయుండు
సర్వ జీవుల సమబుద్ధి సాకుచుండు
నట్టి సర్వేశ ని న్నాత్మయందు దలతు.


కం. సిరి పోగుజేయుటయు మరి
వరపుత్రునియందు ప్రేమ వరలెడుభంగిన్
నిరతము నొక క్షణమైనను
పరశివ నినుగొల్వ ముక్తి బడయుదురుగదా!


సీ. సర్వలోకాధిప! సనకాదిమునివంద్య!
                                         శర్వ! యుమేశ్వర! శరణు శరణు
సచ్చిదానందుండ! స్వఃప్రకాశ! మహేశ!
                                         జగదేకవంద్యండ! శరణు శరణు
నిర్వికల్పుండవో నిగమాంతసంచార!
                                         సర్వలోకాధ్యక్ష! శరణు శరణు
నిర్గుణబ్రహ్మవు నిర్మలజ్ఞ‌ానివి
                                         సాధుమనోల్లాస! శరణు శరణు


గీ. మూడుమూర్తుల కాధారమూర్తి! శరణు
జగము లెల్లను నేలెడి స్వామి శరణు
యెల్లజీవుల రక్షించు యీశ! శరణు
దీనజనవంద్య! మమ్మేలు దేవ దేవ!

(తృతీయావతంసము - సిరియాళ చరిత్రము - సాలగ్రామ చింతామణి కవి) 

వాగ్దేవి స్తుతి

సీ. ఏ మహాదేవి దా నేవేళ్ నాధుని
                                    తలవాకి లిల్లుగా మెలగుచుండు
ఏ మహాదేవి దా నింపుమీరగ వీణ
                                    సామగానమును త్రిస్థాయి మీటు
ఏ మహాదేవి దా నెల్లకవీంద్రుల
                                     వాగ్వీధి సులలిత పదములుంచు
ఏ మహాదేవి దా నెల్లవిద్యలఁ బుత్ర
                                     వాత్సల్యమున నేర్పు పంతులమ్మ


తే.గీ వనజసంభవురాణి గీ ర్వాణి నీల
వేణి పుస్తకపాణియౌ వాణి నాదు
వాక్కుననునిల్చి కృతిరస వంతముగను
తీర్చి దిద్దుతఁ దేనియ తేట పగిది.

(స్తుత్యంజలి - సిరియాళ చరిత్రము - సాలగ్రామ చింతామణి కవి)

Sunday, September 2, 2018

గణాధిపతి స్తుతి

క. అరమేనఁ బ్రియసతీదే
హరమన్ శృంగార రౌద్ర మమరిన నటుఁడీ
సిరియాళవరదుఁ డింజర
మిరవగు శ్రీపార్వతీకృపేశ్వరుఁడోమున్


ఉ. శీతనాత్మజానుతునిఁ 
                           జిత్తసరోజమునందుఁ జేర్చి నే
ప్రీతిని సంస్మరించెద న
                           భీష్ట త్రివర్గఫలాభి కాంక్షతోఁ
జేతులుమోడ్చి వందనము
                           సేసెద విఘ్నములెల్ల ద్రోయ వి
ఖ్యాత యశస్కుఁడౌ యల గ
                            ణాథిపతిన్ శరణాగతావనున్

(స్తుత్యంజలి, సిరియాళ చరిత్రము, సాలగ్రామ చింతామణి కవి)

మరో మాట

నమస్కారం.,

మనదైన సంస్కృతి బ్లాగు మొదలుపెట్టి, 5-6యేళ్లపైనే అయినా, ఋగ్వేద సంధ్యావందనం తప్పితే, మఱొక పోస్టు వేయలేదు. విషయపరిజ్ణానం అంతగా లేకపోవడం ముఖ్యకారణం అయితే, టైం దొరక్కపోవడం ఇంకొక చిన్న కారణం.

ఇకపైన, ఈ బ్లాగులో తెలుగు కవులు రాసిన గ్రంథాల నుండి వివిధ దేవీదేవతల గుఱించి పద్యాలను సేకరించి ఉంచాలని ఉద్దేశ్యంతో మళ్ళీ ఈ బ్లాగుని మళ్ళీ వినియోగిస్తున్నాను. ఇందుకు గల కారణాలు.

1) నాకు తెలిసున్నంతవరకు, మన తెలుగు మతభాష కాదు. అంటే మనగుళ్ళలో చదివే మంత్రాలలో,  సంస్కృతమే తప్ప, తెలుగు ఎక్కడో కానీ కనబడదు. తెలుగువాళ్ళు తమ ఇష్టదైవాన్ని ప్రార్థించాలంటే, సంస్కృతమే కావాలి. మతభాష గురించి, ఇంకొంచెం తెలుసుకోవాలంటే, మన పొరుగునున్న భాషలగురించి, నాకున్న తెలిసున్న నాలుగైదు మాటలు రాస్తాను.

తమిళం: వైష్ణవ సంప్రదాయంలో తమిళానికి, సంస్కృతంతో సమానమైన స్థానమున్నది. తిరుమల వేంకటేశ్వరుని గుడి గోడలను చూస్తేనే ఈ సంగతి మనకు అర్థమై ఉంటుంది. గుడిగోడల మీద శిల్పుల కోడింగ్ తెలుగు (లిపి)లో ఉంటే, శాసనాలూ, స్తుతులు సంస్కృత, తమిళ భాషలలోనే ఎక్కువగా ఉంటుంది. కట్టిన శిల్పులు మన తెలుగువారు, కానీ మన తెలుగు గుడి చరిత్రకి ఎక్కడానికి, విజయనగర కాలం వఱకూ సమయం పట్టింది. గుడిపైనున్న శాసనాల్లో, అన్నిటి కన్నా ప్రాచీనమైనది క్రీ.శ 9 వ శతాబ్దానికి చెందిన పల్లవరాణి "సామవై" వేయించిన తమిళ శాసనం.

తమిళనాడే కాక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఉన్న అన్ని విష్ణ్వాలయాల్లోనూ ధనుర్మాసం సందర్భంగా, చదివే తిరుప్పావై పాశురాలు, తమిళ భాషలోవేనన్న విషయం మనకందరికీ తెలుసు. అవికాక, పాతకాలంనాటి గుళ్లన్నిటిలోనూ, "ద్రవిడవేదం" చదువుతారు.

కన్నడం:  లింగాయతులకు, కన్నడభాషలోని "వచన సాహిత్యం" విశిష్టమైనది. తెలుగులోని "బసవ పురాణం" (పాల్కురికి సోమనాధుడు) కూడా ముఖ్యగ్రంథమైనప్పటికీ, దాని కన్నడ అనువాదమే కన్నడిగులకి ఎక్కువగా పరిచయం. నేటి కర్నాటకకి వెలుపల ఉన్న కేదార్ నాధ్, ఉజ్జయిని, శ్రీశైలం లలో ఉన్న వీరశైవ పీఠాలలో కన్నడ ముఖ్యభాష. కేదార్ నాథ్ గుడిలో సైతం, కన్నడ భాషలో పూజ జరిగే సంప్రదాయం ఉందన్నది, చాలా కొద్ది మందికే తెలుసు.

హిందీవారికి "చాలీసా"లు, సాయిబాబా గుళ్ళలో మరాఠీ భాషలు సేవలు.

తెలుగువారికి ఒక్క దండక సాహిత్యంలో మాత్రమే ఇష్టదైవాన్ని కొలవడం మనం చూస్తాం. ఇవికాక, అన్నమయ్య, త్యాగయ్య, రామదాసు కీర్తనలు, వంటివి గానం చేయడం ఉంది. అయితే, తెలుగు గ్రంథాల పఠనం, ఒక సంప్రదాయంగా లేదు.

2) మన భాషలో ప్రతిరోజు చేసుకునేందుకు సైతం, మనం సంస్కృతాన్నే వినియోగిస్తాము. అందుకే మనకున్న సాహిత్యంలోనుండి, కొన్నిటిని సేకరించి, అంతర్జాలంలో అందుబాటులో ఉంచేందుకు ఈ చిన్న ప్రయత్నం.

3) నిజానికి ఒక సంప్రదాయాన్ని ప్రారంభించాలన్నా, మార్పుచేర్పులు చేయాలన్నా, సర్వసంగపరిత్యాగులు, సన్యాసులు, పీఠాధిపతులు పూనుకోవాల్సి ఉంటుంది. తప్పితే, నాబోటి సాధారణ గృహస్థునికి, ఎంతో కషమైనదని తెలుసు.

4) అయితే, ఈ ప్రయత్నం చేయడం వలన, కొద్దిమందికైనా ఈ అలోచన పంచుకున్నవాణ్ణవుతానని ఆశితున్నాను. కనీసం ఒక్కరికి ఈ ఆలోచన కరెక్టనిపించినా, ఈ ప్రయత్నం విజయవంతమైనట్టుగా భావిస్తాను.

5) ఇందులో, రోజుకో పద్యం చొప్పున, యేడాది పాటు సేకరించాలని, ఇప్పటికి లక్ష్యంగా పెట్టుకుంటున్నాను.

6) ఇందులో ఉంచే పద్యాలుగానీ, ఇతర సాహిత్యం గానీ, నా సొంతది కాదు. నా సొంత పద్యాలు రాసే స్థాయి నాకిప్పటికీ లేదు. భవిష్యత్తులోనైనా వస్తుందని ఆశిస్తున్నాను.

ఈ ప్రయత్నాన్ని, మనకు లభిస్తున్న తెలుగు సాహిత్యంలో మొదటిదయిన "ఆంధ్ర మహాభారతం" లోని సంస్కృత శ్లోకంతోనే ప్రారంభిస్తున్నాను.

శ్రీవాణీ గిరిజాశ్చిరాయ దధతో వక్షో ముఖాఙ్గేషు యే
లోకానాం స్థితిమావహన్త్యవిహతాం స్త్రీపుంసయోగోద్భవామ్,
తే వేదత్రయమూర్తయ స్త్రిపురుషాస్సంపూజితా వ స్సురై
ర్భూయాసు: పురుషోత్త మామ్హుజభవ శ్రీకన్ధరా శ్శ్రేయసే

అటుపైన మా మునిముత్తాతగారు సాలగ్రామ చింతామణి కవి గారు రచించిన "సిరియాళ చరిత్రము"లోని పద్యాలతో పోస్టులను వేయదలుచుకున్నాను. 

నెనరులు